ఈనాడు వారి సౌజన్యంతో... గమనిక:ctrl+ నొక్కడం ద్వారా అక్షరాలు స్పష్టంగా కనిపిస్తాయి.
డీఎస్సీ మార్కులను ప్రభుత్వం ప్రకటించడంతో పోస్టు వస్తుందా? రాదా? అనే ఆందోళన అభ్యర్థులందరిలో మొదలైంది. ఎలా తెలుసుకోవాలో అర్థం కావడం లేదు. డీఎస్సీ పరీక్షతో జిల్లాలు, జోన్ లు, రిజర్వేషన్లు, పోస్టుల సంఖ్య తదితర ఎన్నో అంశాలు ముడిపడి ఉండటంతో కటాఫ్ అంచనా వేయడం సాధ్యం కాదు. పైగా అభ్యర్థులందరి మార్కుల లిస్టు లేకుండా అసలు సాధ్యం కాదు. అంచనాలు ఎక్కడికక్కడ మారిపోతుంటాయి. కానీ దరఖాస్తు చేసిన అభ్యర్థుల సంఖ్యను ఆధారం చేసుకొని, అందరి మార్కులను నోట్ చేసుకొని ఒక అంచనాకు వచ్చేందుకు కొంత మంది విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అప్పటికీ సరైన అంచనాకు రావడం కష్టమే అయినప్పటికీ ఈ కింది కొన్ని సూచనలతో కొంత వరకు ఫలితాన్ని లెక్కగట్టే ప్రయత్నం చేయవచ్చు.
తమ కంటే ఎక్కువ మార్కులు పొందిన వారి లిస్టు తయారు చేసిన అభ్యర్థులు వాటిని, రిజర్వేషన్ల వారీగా, జోన్ల వారీగా, లోకల్, నాన్ లోకల్ వారీగా విభజించాలి. నోటిఫికేషన్ లో పేర్కొన్న పోస్టుల రోస్టరు విభజనకు అనుగుణంగా మెరిట్ లిస్టును రూపొందించుకోవాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు అత్యధిక మార్కులు పొంది ఉంటే, రిజర్వేషన్ తో సంబంధం లేకుండా ఓపెన్ విభాగంలో పోస్టు పొందుతారు. ఉదాహరణకు బీసీ – బీ విభాగానికి చెందిన మహిళకు అత్యధిక మార్కులు వస్తే ఆమెను ముందుగా ఓపెన్ విభాగం జనరల్ పోస్టుకు పరిశీలిస్తారు. అక్కడ ఆమె కంటే ఎవరికీ ఎక్కువ మార్కులు రాకపోతే పోస్టును ఆమెకే కేటాయిస్తారు. ఒక వేళ అక్కడ ఆమెకు అక్కడ పోస్టు రాకపోతే... తర్వాత ఓపెన్ మహిళలకు రిజర్వేషన్ కింద కేటాయించిన పోస్టులకు పరిశీలిస్తారు. ఇక్కడ కూడా ఆమె కంటే ఎక్కువ మార్కులు పొందిన వారు ఉంటే, తర్వాత బీసీ-బీ జనరల్ విభాగంలో పరిశీలిస్తారు. ఆ కేటగిరీ కిందకు వచ్చే వారితో పోల్చి నప్పుడు ఆమెకే ఎక్కువ మార్కులు వచ్చి ఉంటే పోస్టు కేటాయిస్తారు. ఇక్కడ కూడా రాక పోతే... చివరకు బీసీ – బీ మహిళలకు కేటాయించిన పోస్టుల కోసం ఆమె మార్కులను పరిశీలిస్తారు. ఈ విధంగా నాలుగు దశల్లో ఆమె మెరిట్ ను పరిశీలిస్తారు. ఇదే విధానాన్ని ఇతర రిజర్వేషన్ వర్గాలకు కూడా అనువర్తింపజేస్తారు. అత్యధిక మార్కులు వచ్చిన వారికి కేటగిరీలతో సంబంధం లేకుండా పోస్టులను కేటాయిస్తారు. లోకల్, నాన్ లోకల్ అంశాలను కూడా జాగ్రత్తగా పరిశీలించాలి. ప్రతి కేటగిరీకి ఉన్న పోస్టుల్లో 20 శాతం పోస్టులను నాన్ లోకల్ కి ఇస్తారు. కనీసం 3 పోస్టులు ఉంటేనే ఈ నాన్ లోకల్ రిజర్వేషన్ ను వర్తింపజేస్తారు. ఇక్కడ గుర్తించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... ఇతర రిజర్వేషన్ల లాగా వీటిని కచ్చితంగా అమలు చేయరు. ఇక్కడ లోకల్ అభ్యర్థులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఉదాహరణకు ఒక జిల్లాలో ఓపెన్ విభాగంలో 90 పోస్టులు ఉన్నాయనుకుంటే నాన్ లోకల్ కి 20 శాతం అంటే 18 పోస్టులు కేటాయిస్తారు. కానీ టాప్ 18 మార్కులు పొందిన వారిలో నాన్ లోకల్ అభ్యర్థులు ఉంటేనే వారికి పోస్టు వస్తుంది. అలా కాకుండా టాప్ 18 లో లోకల్ అభ్యర్థులు ఉంటే వారికే పోస్టు కేటాయిస్తారు. టాప్ 18 లో నాన్ లోకల్ అభ్యర్థులు లేకపోతే ఆ పోస్టులను కూడా లోకల్ అభ్యర్థులతోనే భర్తీ చేస్తారు. మరోముఖ్యమైన అంశం వయసు. ఒకే మార్కు వచ్చిన అభ్యర్థులు ఉంటే, వారిలో ఎక్కువ వయసు ఉన్న అభ్యర్థి కి పోస్టు కేటాయిస్తారు. ఒక వేళ ఒకే మార్కు, ఒకే వయసు కూడా ఉంటే వారిలో మహిళా అభ్యర్థికి ప్రాధాన్యం ఇచ్చి ఆమెకే పోస్టు ఇస్తారు. పీహెచ్ అభ్యర్థులు కూడా పోస్టు ఎవరికి రిజర్వు అయి ఉందో అంటే హెచ్ వర్గానికా, వి వర్గానికా లేదా ఓహెచ్ వర్గానికా అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏ వర్గానికి కేటాయించి ఉంటే వారికే పోస్టు ఇస్తారు. పీహెచ్ అయినా పోస్టు రాలేదేమిటా అని బాధ పడే అభ్యర్థులు ఈ విషయాన్ని తప్పనిసరిగా గమనించాలి. కటాఫ్ అంచనా వేయటం సాధ్యం కాదు కాబట్టీ ఈ సూచనల ఆధారంగా అభ్యర్థులు తమ డిఎస్సీ ఫలితాన్నే అంచనా వేసుకోడానికి ప్రయత్నించవచ్చు.